2008/02/17

మన దగ్గరకు వచ్చిన సాంకేతిక చైతన్యం 'సైన్స్ ఎక్స్ ప్రెస్'



శాస్త్ర, సాంకేతిక రంగాల్లో యువకులకు ఆసక్తిని పెపొందించడం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఒక వినూత్న రైలు ఎగ్జిబిషన్ 'సైన్స్ ఎక్స్ ప్రెస్' ను అక్టోబరు 31న ప్రధాని మన్మోహన్ సింగ్, జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ లు న్యూఢిల్లీలో పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈరైలు దేశవ్యాప్తంగా 57 నగరాలను చుట్టివస్తుంది. ప్రపంచంలోనే అతి పెద్ద మొబైల్ సైన్స్ ఎగ్జిబిషన్ 'సైన్స్ ఎక్స్ ప్రెస్' రైలు ఈరోజు మన రాష్ట్రంలోనికి వచ్చింది. ఈనెల 17 నుంచి 19 వరకు విశాఖలో, 20 నుంచి 22 వరకు విజయవాడలో, 23 నుంచి 27 వరకు సికింద్రాబాద్ లో, 28వ తేదీన గుంటూరులోనూ ఆగుతుంది. మర్నాడు మద్రాసు లోని ఎగ్మూర్ కు బయలుదేరి వెళ్తుంది. విద్యార్ధుల్లో సైన్సు పట్ల, పరిశోధనల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నారు.

జర్మనీలోని సుప్రసిద్ధ సైన్స్ టన్నెల్ ఎగ్జిబిషన్ తరహాలో రూపొందించిన ఈ ప్రత్యేక ఎగ్జిబిషన్ లో శాస్త్ర, సాంకేతిక రంగాలలో పరిశోధనలకు సంబంధించి 12 అత్యాధునిక విభాగాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి రూపొందించారు. శాస్త్ర, సాంకేతిక విభాగం, భారతీయ రైల్వే, జర్మనీకి చెందిన విద్యాశాఖ, పారిశ్రామిక భాగస్వాముల సహకారంతో జర్మనీకి చెందిన మాక్స్ ప్లాంక్ సొసైటీ నిర్మించినది ఈ ప్రత్యేక రైలు. జర్మనీలో సైన్స్, ఇంజనీరింగ్ రంగాల్లో లభిస్తున్న అవకాశాలను యువకులకు వివరించడం కోసం ఒక ప్రత్యేక బోగీని రూపొందించారు. జర్మనీ రసాయనాల పరిశ్రమ బి.ఎ.ఎస్.ఎఫ్. మరో బోగీని 'కిడ్స్ ల్యాబ్'గా రూపొందించింది. ఇక్కడ విద్యార్ధులు రసాయనిక శాస్త్ర ప్రయోగాలను స్వయంగా నిర్వహించవచ్చు.

ఆంధ్రజ్యోతి వార్త ప్రకారం, రిజిస్ట్రేషన్ చేయించుకోదల్చుకున్న వారు 9849908669 (విశాఖ), 9849908668 (విజయవాడ), 9849908666 (సికింద్రాబాద్) ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు.

1 అభిప్రాయాలు:

Anonymous said...

మంచి సమాచారం అందించారు. సామాన్య ప్రజల్లో చైతన్యం రావటానికి మన దేశంలో ఇలాంటి ప్రయోగాలు ఎంతో అవసరం.

Post a Comment

Thank you for your comments